“బాంచెన్ కాళ్లు మొక్కుతా… వికలాంగుల పెన్షన్ ఇప్పించండి సారూ…”
ప్రజావాణిలో కదిలించే దృశ్యం – వీల్ చైర్ వద్దకే వచ్చిన అధికారి
వికలాంగుడి వద్దకే మెట్లు దిగి వచ్చి దరఖాస్తు తీసుకున్న MPDO రాంప్రసాద్ రావు – అభినందిస్తున్న ప్రజలు
తొవ్వ న్యూస్, నర్సింహులపేట, ఆగష్టు. 31
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట MPDO కార్యాలయం వద్ద హృదయాన్ని కదిలించే దృశ్యం చోటు చేసుకుంది.

మండల కేంద్రానికి చెందిన వికలాంగుడు కూరపాటి రాంబాబు 20 ఏళ్లుగా వికలాంగుల పెన్షన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు. లేచి నడవలేని స్థితిలో వీల్ చైర్ పై వచ్చిన అతను “బాంచెన్ కాళ్లు మొక్కుతా… నాకు పెన్షన్ ఇప్పించండి సారూ” అంటూ వేడుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన MPDO రాంప్రసాద్ రావు వెంటనే తన చాంబర్ నుండి బయటకు వచ్చి, మెట్లు దిగి, వికలాంగుడి వద్దకే స్వయంగా వెళ్లి అతని చేతి నుండి దరఖాస్తును తీసుకున్నారు.
ఆ దృశ్యం అందరి హృదయాలను కదిలిస్తోంది. వీల్ చైర్ లో కూర్చున్న రాంబాబు నుండి ఎర్ర చొక్కా ధరించిన MPDO రాంప్రసాద్ రావు గారు దరఖాస్తు తీసుకుంటుండగా, వెనుక ప్రజావాణి హెల్ప్ డెస్క్ వద్ద అధికారిణి చూస్తున్న దృశ్యం మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. 51% అంగవైకల్యం ఉన్న రాంబాబుకు ఇప్పటివరకు సదరం సర్టిఫికేట్ లేక పెన్షన్ రాలేదు. ఇటీవల ID: 12130612608210001 తో 51% వైకల్యంగా నిర్ధారణ అయింది. చివరి రోజు కావడంతో ఆన్లైన్ కాపీతో దరఖాస్తు చేసుకున్నాడు.
MPDO గారి మానవతా దృక్పథాన్ని, వికలాంగుడి పట్ల చూపిన ఆప్యాయతను గ్రామస్తులు, దివ్యాంగుల సంఘం ప్రతినిధులు కొనియాడుతున్నారు. అధికారులు అందరూ ఇలాగే స్పందించాలని కోరుతున్నారు.